- October 26, 2021
- Media , TiE Sustainability Summit 2021
- Comments : 0
TIE sustainability summit 2021: పర్యావరణహిత పారిశ్రామికీకరణే లక్ష్యంగా.. టై సమ్మిట్.!
పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధితో పాటు.. పర్యావరణ సమతుల్యతను కాపాడాల్సిన ఆవశ్యకతను టై(TIE- The Indus Entrepreneurs)సదస్సు నొక్కి చెప్పింది. టై- హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో టై సస్టేనబిలిటీ సమ్మిట్(TIE sustainability summit)- 2021ను నిర్వహించింది. భవిష్యత్తు తరాల కోసం పరిశ్రమల వ్యవస్థాపకులు వారి పరిశ్రమల్లో స్థిరత్వం(sustainability) జోడించుకోవాలని శిఖరాగ్ర సదస్సు సూచించింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ వర్చువల్ సదస్సులో 50కు పైగా దేశాల నుంచి 40 వేలమంది ప్రతినిధులు, 10 వేల స్టార్టప్లు, 15 వేల మంది పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు.
ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం- సుస్థిరత ప్రధానాశాంలుగా హైదరాబాద్ వేదికగా టై(TIE- The Indus Entrepreneurs) సదస్సు ప్రారంభమైంది. హెచ్ఐసీసీలో జరగుతున్న ఈ సదస్సు సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. మొదటి రోజు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, పలువురు పారిశ్రామిక వేత్తలు, అంకుర కంపెనీలు, ఇజ్రాయిల్, కోస్టారికా దేశ ప్రతినిధులు హాజరయ్యారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు వారి వారి రంగాల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు టై(TIE- The Indus Entrepreneurs) బృందం పాటుపడుతోంది. ఈసారి టై(TIE) ఆధ్వర్యంలో సమ్మిళిత వృద్ధి అనే అంశంపై గ్లోబల్గా పారిశ్రామిక వేత్తలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి పర్యావరణ హిత పారిశ్రామికీకరణకు కంకణబద్ధులవుదామని టై ఛాప్టర్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా సస్టేనబిలిటీ, సాంకేతికతో ప్రపంచ దేశాలకు మోడల్గా ఎదుగుతున్న ఇజ్రాయిల్, కోస్టారికా దేశాల నుంచి ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేసింది. రాష్ట్రంలోనూ రెన్యువబుల్ ఎనర్జీ, టెక్నాలజికల్ ఫార్మింగ్ను ప్రోత్సహించేందుకు ఇజ్రాయిల్, కోస్టారికా దేశాలతో టై(TIE)- హైదరాబాద్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
తెలంగాణ ఇన్నోవేషన్ల ప్రదర్శన
ఇజ్రాయిల్లో శక్తి అవసరాలకు 98 శాతం పునరుద్ధరణ చేసే వనరుల నుంచే పొందుతుందని.. సాంకేతికతలో ఇజ్రాయిల్ ప్రపంచానికే రోల్ మోడల్గా నిలిచిందని.. ఈదేశాల విధానాల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ పేర్కొన్నారు. తెలంగాణ సైతం హరితహారం, చెరువుల పునరుద్ధరణ వంటి పథకాలతో సస్టేనబిలిటీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తోందని.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఫార్మాసిటీ రూపకల్పనలోనూ పర్యావరణహిత మోడళ్లకే ప్రాధాన్యమిస్తున్నామని జయేశ్ రంజన్ తెలిపారు. మంగళవారం జరిగే సదస్సులో సస్టేనబిలిటీ రంగంలో తెలంగాణ ఇన్నోవేషన్లను ప్రముఖంగా ప్రదర్శించనున్నట్లు వివరించారు.
అంకురాలకు వేదికగా
టై(TIE) హైదరాబాద్ ఆధ్వర్యంలో రూరల్ ఇన్నోవేటర్ ప్రోగ్రాంను ఈ సద్ససులో భాగంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ ఆవిష్కర్తలకు మెంటరింగ్, పెట్టుబడి సహాయం, డిజైన్ అండ్ ఆపరేషనల్ సపోర్ట్ను ఈ కార్యక్రమం ద్వారా అందించనున్నారు. అరకు కాఫీని పారిస్ కప్ఆఫ్ టీగా మార్చటమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని టై(TIE) హైదరాబాద్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. సస్టేనబిలిటీ రంగంలో స్టార్టప్లకు గమ్యస్థానంగా హైదరాబాద్ను నిలపడానికి ఈ శిఖరాగ్ర సదస్సు ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం- సుస్థిరత అనే మూడు స్తంభాలను పరిష్కరించడానికి ఈ సస్టేనబిలిటీ సమ్మిట్ ద్వారా అవగాహన కల్పించాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు